- అదే సమస్య.. అదే అధికారి.. మళ్లీ అదే వినతి..!
- శాయంపేట ప్రజావాణిపై ప్రజల ప్రశ్న
Praja Vani… a platform for resolution?
Or just a new address for old petitions..? : ఏళ్లుగా అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగి ఇచ్చిన అర్జీ.. అదే సమస్యపై మళ్లీ వినతి.. అదే స్థాయి అధికారి వద్ద మరోసారి ఫిర్యాదు! అర్జీకి ‘ప్రజావాణి’ అనే కొత్త పేరు పెట్టినంత మాత్రాన సమస్యకు పరిష్కారం లభిస్తుందా? సమస్య విన్న అధికారి మారకపోతే.. పరిష్కారానికి బాధ్యత వహించే వ్యవస్థ మారకపోతే.. ప్రజావాణి కూడా సాధారణ అర్జీల స్వీకరణ కార్యక్రమంగానే మిగిలిపోదా..? హనుమకొండ జిల్లా శాయంపేటలో నిర్వహించిన తొలి మండల ప్రజావాణి ఈ కీలక ప్రశ్నలను ప్రజల ముందుకు తెచ్చింది. ప్రజలకు కావాల్సింది మరో అర్జీ కాదు.. తమ సమస్యకు పరిష్కారంపై భరోసా.
********
ప్రజల సమస్యలను మండలస్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ప్రజావాణి.. సాధారణ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంగా పరిమితమైతే దాని అసలు ఉద్దేశమే ప్రశ్నార్థకంగా మారుతుంది.
హనుమకొండ జిల్లా శాయంపేటలో నిర్వహించిన తొలి మండల ప్రజావాణి సందర్భంగా ప్రధానంగా తెరపైకి వచ్చిన ప్రశ్న ఇదే. ఇప్పటికే సమస్యను చెప్పుకున్న అదే అధికారికి.. ప్రజావాణి పేరుతో మళ్లీ అర్జీ ఇస్తే పరిష్కారం ఎలా భిన్నంగా ఉంటుంది..?
అదే అధికారి.. అదే సమస్య.. కొత్తగా ప్రజావాణి ఎందుకు..?
ఒక సమస్యపై ప్రజలు ఇప్పటికే మండల కార్యాలయాన్ని ఆశ్రయించి ఉండొచ్చు. సంబంధిత అధికారికి అర్జీ ఇచ్చి ఉండొచ్చు. పలుమార్లు విన్నవించి ఉండొచ్చు. అయినా పరిష్కారం కాకపోతే.. అదే సమస్యను అదే స్థాయి అధికారికి మరోసారి ప్రజావాణిలో అందజేయడం వల్ల అదనంగా జరిగేదేమిటన్నదే అసలు ప్రశ్న. ప్రజావాణి కేవలం “అర్జీ స్వీకరించాం” అనే స్థాయిలోనే ఉంటే.. అది రోజువారీ పరిపాలనా ప్రక్రియకు మరో పేరుగా మాత్రమే మిగిలిపోతుంది. ఇప్పటికే పరిష్కారం కాని సమస్యలను గుర్తించి, వాటిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, బాధ్యతను నిర్దేశించడం, పరిష్కారానికి గడువు విధించడం, అనంతరం పురోగతిని పర్యవేక్షించడం జరిగినప్పుడే ప్రజావాణికి ప్రత్యేకత వస్తుంది.
అర్జీ మారితే.. పరిష్కారం మారుతుందా..?
ప్రజావాణి పేరుతో వినతిపత్రం తీసుకోవడం ఒక ప్రక్రియ. కానీ ప్రజలకు కావాల్సింది ప్రక్రియ కాదు.. పరిష్కారం. గతంలో అధికారుల దృష్టికి వెళ్లిన సమస్య మళ్లీ ప్రజావాణికి వస్తే.. దాన్ని కొత్త అర్జీగా కాకుండా “ఇప్పటికే ఎందుకు పరిష్కారం కాలేదు..?” అనే ప్రశ్నతో పరిశీలించాలి. పెండింగ్ సమస్యలను ప్రత్యేకంగా సమీక్షించి, వాటి పరిష్కారానికి బాధ్యత వహించే అధికారిని నిర్దేశించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘ఫాలోఅప్’ లేకుంటే.. ప్రజావాణి ఎందుకు..?
అర్జీ తీసుకున్నారు.. సంబంధిత శాఖకు పంపారు.. అంతటితో బాధ్యత ముగిస్తే ప్రజావాణి కూడా సాధారణ అర్జీ ప్రక్రియగానే మారుతుంది. ప్రతి ఫిర్యాదుకు నమోదు సంఖ్య, బాధ్యత వహించే అధికారి, పరిష్కార గడువు, ప్రస్తుత స్థితి నిర్దేశించి.. తదుపరి ప్రజావాణిలో వాటిపై సమీక్ష జరిగేలా వ్యవస్థ ఉండాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే తమ అర్జీ పరిస్థితి తెలుసుకోవడానికి ప్రజలు మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది.
ప్రజావాణి.. ‘ఎస్కలేషన్’ వేదిక కావాలి
మండలస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఎస్కలేషన్ వేదికగా ప్రజావాణి మారాలి. రోజువారీ విధుల్లో భాగంగా పరిష్కరించాల్సిన సమస్యలు మండల కార్యాలయాల్లోనే పరిష్కారం కావాలి. అవే సమస్యలు పదేపదే ప్రజావాణికి వస్తున్నాయంటే.. సమస్యతో పాటు పరిష్కారం కాకపోవడానికి కారణమైన పరిపాలనా వైఫల్యాన్ని కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజావాణి.. అర్జీల సంఖ్య కోసం కాదు, పరిష్కారాల కోసం అనేలా ఉండాలని పలువురు భావిస్తున్నారు. ప్రజల సమస్యలు వినడం పరిపాలనలో మొదటి అడుగు మాత్రమే. పరిష్కరించడం అసలు లక్ష్యం. అందుకే ప్రజావాణి ప్రతి వారం జరిగే మరో అర్జీల కార్యక్రమంగా కాకుండా.. పరిష్కారం కాని సమస్యలను గుర్తించి, బాధ్యతను నిర్దేశించి, గడువు విధించి, పరిష్కారాన్ని పర్యవేక్షించే బాధ్యతాయుత వేదికగా మారాలి. అదే అధికారి.. అదే కార్యాలయం.. అదే సమస్య.. మళ్లీ అదే అర్జీ అయితే ప్రజలకు మిగిలేది భరోసా కాదు.. మరో నిరీక్షణే.
శాయంపేటలో తొలి ప్రజావాణి ఇప్పుడు ప్రభుత్వానికి ఇదే ప్రశ్నను సంధిస్తోంది. ప్రజావాణి అర్జీలను స్వీకరించే వేదికగానే మిగులుతుందా..? లేక పరిష్కారం జరిగే వరకు ప్రజల వెంట నిలిచే బాధ్యతాయుత వ్యవస్థగా మారుతుందా..? అనేది అధికారుల పని తీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఇక వేచిచూడాల్సిందే….
