
- వరంగల్ ఆర్టీఏ లో ఆయన చెప్పిందే వేదం..!
- చక్రం తిప్పుతున్న ఎంవీఐ…
- జరిగేదంతా ఆయన కనుసన్నల్లోనే…
- ఉన్నతాధికారులకు ఒకరకంగా సవాలే…
————————————-
వరంగల్ జిల్లాలోని ఓ మండలానికి చెందిన ఒక్కరు తన ఆటో ఫిట్నెస్ కోసం వరంగల్ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లారు. ఫిట్నెస్ ఫీజు రూ. 600 ఉండగా అక్కడ దళారులు మాత్రం మరో రూ. 500 అవుతాయాని చెప్పారు. విధిలేక ఆ డబ్బులు చెల్లించి పని పూర్తి చేయించుకున్నారు.
************
మరో మండలానికి చెందిన ఒకరు లెర్నింగ్ లైసెన్స్, కోసం నేరుగా స్లాట్ బుక్ చేసుకుని కార్యాలయానికి వెళితే పని అవుద్దో కాదో అని అక్కడి దళారులను ఆశ్రయించారు. ప్రభుత్వ ఫీజు రూ. 450 అయితే దానికి బదులుగా మరో రూ. 1000 నుంచి రూ. 1500 వరకు సమర్పించుకున్నట్లు తెలిసింది. వరంగల్ నగరానికి చెందిన ఓ యువకుడు పర్మినెంట్ లైసెన్స్ కోసం ఆన్ లైన్ లో ఫీజు సుమారుగా రూ:1400 చెల్లించి కార్యాలయానికి వెళ్లగా అదనంగా 12 వందల నుండి 15 వందల వరకు ఖర్చు అయినట్లు బాధితుడు జననిర్ణయం ప్రతినిధి కి తెలిపారు. ఇదంతా ఆ ఇంచార్జి డిటివో తోపాటు మరో అధికారి కనుసన్నల్లోని ప్రైవేట్ అసిస్టెంట్ లే వసూళ్లు చేయడం గమనార్హం
*****************
ఇంకో మండలానికి చెందిన రైతు ట్రాక్టర్ ఫిట్నెస్ కోసం వెళ్లితే ప్రభుత్వ నిర్ణిత ఫీజు రూ. 800. ఉండగా అక్కడ మాత్రం సుమారు రూ.1700 వరకు చెల్లించి వస్తుంది.
****************
“Shobhan” wheel in the transport department : రవాణాశాఖ కార్యాలయం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. అక్కడ ఏ పనికోసం వాహనదారులు వెళ్లినా జేబులు ఖాళీ కావాల్సిందే. నేరుగా కార్యాలయానికి వెళ్లి సొంతంగా పని చేయించుకుందామనుకుంటే పట్టపగలే చుక్కలు చూడాల్సిందే. దళారులు లేనిదే పని ముందుకు సాగదు. ఇందుకు సినీ నటుడు శోభన్ బాబు ను మించిన శోభన్ బాబు ఆ కార్యాలయాన్ని శాసించడమే అనేది బహిరంగ రహస్యమే. కార్యాలయంలో అధికారులు కింద పనిచేసే సిబ్బంది కలెక్షన్ ఏజెంట్లుగా మారి దళారులతో కుమ్మక్కై అక్రమంగా వసూళ్లకు పాల్పడుతుండటం అక్కడ సర్వసాధారణంగా మారింది.
“Shobhan” wheel in the transport department
- అంతా ఆ అధికారి కనుసన్నల్లోనే…
అక్కడ ఆ అధికారి కనుసన్నల్లో దళారుల ఇష్టారాజ్యం సాగుతోంది. ఏపని జరగాలన్నా చేయి తడపాల్సిందే. వాహనదారులు నిలువుదోపిడీకి గురవుతున్నా పట్టించుకునే వారే లేరిక్కడ. ప్రతి పనికి ఒక ధర నిర్ణయించి వాహనదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్, సీసీ బదిలీ, లైసెన్స్ రెన్యూవల్ వంటి పనుల కోసం వచ్చే వాహనదారులు ప్రభుత్వ నిర్ణీత ధరలకు మించి ముడుపులు చెల్లించాల్సిందే. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. తనిఖీలు చేయకపోవడంతో దళారులదే ఇష్టారాజ్యంగా మారింది. ఇప్పటికైనా అధికారులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.