
ఇటీవల చోటుచేసుకున్న రెండు ప్రధాన అంశాలు భారతదేశంలోని లౌకికవాదానికి తీవ్రమైన రెండు ప్రశ్నలను సంధిస్తున్నాయి. ఒకటి, అజ్మీర్ దర్గా చారిత్రక ప్రాశస్త్యాన్ని కోర్టులో కేసులు వేసి వివాదంలోకి లాగడం, రెండవది, బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల భారత దేశంలోని లౌకిక వాదులు, ప్రతిపక్ష నాయకులు, కమ్మ్యూనిస్టులు,హేతువాదులు మౌనంగా ఉండిటం సరైనవి కావు. ఈ రెండు అంశాలు సమాజంలో మతతత్వం విస్తరణను ,లౌకిక,హేతువాద ,మానవత్వ విలువల వాదం యొక్క పతనాన్ని సూచిస్తున్నాయి.
అజ్మీర్ దర్గా అనేది భారతీయ సాంస్కృతిక సమ్మిళితతకు చిహ్నం. సూపీ సంప్రదాయం ద్వారా ప్రేమ, సహనంతో కూడిన జీవన విధానాన్ని ప్రచారం చేసిన ఈ స్థలం, శతాబ్దాలుగా అన్ని మతాల ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగివుంది. అయితే, బీజేపీ నేత మదన్ రాథోర్ చేసిన ఆరోపణలతో ఈ స్థలం ఒకప్పటి శివాలయం అంటూ కోర్టు వివాదంలోకి లాగబడింది. గతంలో ఎప్పుడో కొన్ని వందల ఏళ్ళ నాడు జరిగిన చారిత్రక సంఘటనలను ఇప్పుడు వివాదంలోకి లాగి రచ్చ చేయటం ఎంత మాత్రం సరైంది కాదు. ఎప్పడో ఎవరో పాలకుడు చేసిన తప్పిదాల ఆధారంగా ఈరోజున కోర్టులో కేసులు వేయడం, వాటిని కోర్టులు విచారణకు స్వీకరించటం ఖండించ తగినవి. ఇలాంటి చర్యలు దేశంలోని శాంతియుతంగా సహజీవనం చేస్తున్న ప్రజల మధ్య మత సామరస్యానికి హాని కలిగించే చర్యగా భావించవచ్చు.
బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీ సోదరులపై దాడులను ఎందుకు లౌకిక ప్రజాస్వామిక వాదులు ఖంఢించరు? ఇది పరమ మూర్కత్వం కాదా?
—————
ఇక రెండొ విషయం బంగ్లాదేశ్ విషయానికి వస్తే, అక్కడి హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు మరింత హేయమైన చర్య. అక్కడ దృష్యాల వీడియోలు చూస్తుంటే మానవత్వం కలవారికి మనసు వికలం అవుతుంది.అక్కడి ఇస్లాం మత ఛాందస వాదుల హింసాత్మక చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.అమాయక హిందూ మైనార్టీ ప్రజలు అన్యాయంగా దౌర్జన్యాలకు గురవుతున్నారు. కరుడుగట్టిన మూర్కపు ఇస్లామిక్ మతతత్వవాదులు హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడులపై భారతదేశంలోని లౌకికవాదులు మౌనం వహించడం ప్రశ్నార్థకమే కాదు. క్షమించరాని నేరం కూడా. మతతత్వాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటించే మన ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ కోసం పోరాడే అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్ గాంధీ,వామ పక్ష నేతల నోళ్ళు ఒక్కసారిగా పడిపోయాయా? పక్షపాత ధోరణితో,పక్షవాద రోగం వచ్చిందా? మానవత్వం మంటకలుస్తుంటే ఖంఢించని నాయకులెందుకు? ముఖ్యంగా పార్లమెంటులో,మీడియా ముందు ఈ అంశంపై స్పందించకపోవడం క్షమించరాని నేరం కాదా? ఈ విషయంలో పార్టీలకు, భావజాలాలకు,ఇజాలకు అతీతంగా భారత ప్రభుత్వం తీసుకొనే చర్యలకు అందరూ తమ మద్ధత్తును ఇవ్వాలి.
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే రాజ్యాంగ స్ఫూర్తిపై ఆధారపడి ఉంది. అందుకే అన్ని రకాల మతతత్వాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం మరింత అత్యవసరం అవుతుంది. కేవలం మెజారిటీ మతతత్వాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని, మైనారిటీ మతతత్వాన్ని పట్టించుకోకపోవడం లౌకిక భావాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.
సమాజంలో సత్యాన్వేషణకు, సహనానికి అడ్డుగా మారుతున్న మతతత్వ ప్రభావాలను ఎదుర్కోవడంలో విపక్షాలు,హేతువాదులు,మానవతా వాదులు, లౌకికవాదులు,ప్రజాస్వామిక వాదులు అందరూ ఐక్యంగా కలసి రావాలి. స్పష్టమైన వైఖరిని తీసుకోవాలి. భారతదేశ యువతను సంఘ్ పరివార్ నేరేటివ్స్ నుంచి రక్షించాలంటే, సమగ్ర లౌకికవాద దృక్పథాన్ని ప్రోత్సహించడం ఒక్కటే మార్గం. అన్ని రకాల మతతత్వ మూలాలకు వ్యతిరేకంగా సమదృష్టితో నిలబడగలిగితేనే లౌకికవాదం,మానవత్వం బలపడుతుంది.
మౌనం లౌకికతకు శత్రువు. మతతత్వాన్ని వ్యతిరేకించాలనుకుంటే ప్రతి ఘటనపై న్యాయంగా, ధైర్యంగా స్పందించాలి. మౌనం వీడాలి. ఈ మౌనం లౌకికవాదాన్ని బలహీనపరచడమే కాకుండా, మతతత్వ పాసిస్టు శక్తులకు బలాన్ని చేకూరుస్తుంది. లౌకికతను కాపాడటానికి అన్ని వర్గాల ప్రజలు,నాయకులు మౌనాన్ని విడనాడాల్సిన తరుణం ఆసన్నమైంది.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్, సెల్ : 9849328496