
Oplus_131072
- మదర్ థెరిస్సా నిజమైన వారసుడు ఫాదర్ కొలంబో
ఫాదర్ అగస్టో కొలంబో జననం 15 మార్చి 1927( మరణం 31 ఆగస్టు 2009) న ఉత్తర ఇటలీలోని కోమో ప్రావిన్స్లోని కాంటూ అనే చిన్న పట్టణం లో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం లో జన్మించారు.
1952లో భారతదేశానికి బయలుదేరారు, PIME ( పొంటిఫికల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫారిన్ మిషన్స్) సంస్థ 1855 నుండి పనిచేస్తోంది. ఆ సంవత్సరాల్లోనే భారత దేశంలోని సామాజిక అణచివేత గురికాబడిన వారు బౌద్ధమతం మరియు క్రైస్తవ మతం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆగస్టో మూడు పారిష్లతో కూడిన ఖమ్మం డయోసెస్ (1988) స్థాపకుల్లో ఒకరు. భారతదేశంలో దాదాపు అరవై సంవత్సరాల మిషన్లో, అతను మతసంబంధమైన పనితో పాటు, దీనులకు, అభాగ్యులకు మరియు కడుపేద వారి ప్రోత్సాహానికి అనేక కార్యక్రమాలను రూపొందించాడు, పేదలకు గృహాలు, సాంప్రదాయ చేతిపనుల ఉత్పత్తి మరియు అమ్మకాలకు సహకార సంస్థలు, దళితుల భూము లకు చట్టపరమైన రక్షణకు అతని నిబద్ధత, వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాడటానికి గ్రామీణ బ్యాంకులు, కుష్టురోగులకు ఆరోగ్య సంరక్షణ, విద్య, అక్షరాస్యతను మొదలైనవి, కల్పించుటలో కొలంబో గారు, బడుగు బలహీనర్గాలకు దగ్గర అయ్యారు.. .
తెలుగు నేలపై నిశ్శబ్ద సామాజిక విప్లవకారి..
ఫాదర్ కొలంబో పేరు వినగానే వారిని ప్రత్యక్షంగా చూసిన వారికి నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, సేవాగుణం, దయాగుణం, ప్రేమ, సహనం, మనుషుల్ని మనుషులుగా ప్రేమించడం లాంటి సుగుణాలు గుర్తుకొస్తాయి. ఫాదర్ కొలంబో తెలుగు నేలపై నిశ్శబ్ద సామాజిక విప్లవాన్ని తీసుకురావడంలో విజయం సాధించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. లక్షలమంది పేద విద్యార్థులకు విద్యని అందించడంతో పాటు ఎంతోమంది నిరుపేద మరియు సామాజికంగా వెలివేయబడినటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను, దీనులను చేరదీసి వారికి సామాజిక ఆర్థిక భద్రతను కల్పిస్తూ ఎన్నో వేల కుటుంబాలల్లో వెలుగులు నింపడం జరిగింది. ఫాదర్ కొలంబో ఒక వ్యక్తి సమాజంలో ఎంతైనా మార్పు తీసుకు రాగలరు అని నిరూపించగలిగారు.
సేవ అనేది వారి ముఖ్యమైన గుణం..
వారు సైకిల్ పైన గ్రామ గ్రామాలని తిరుగుతూ గ్రామంలో ఉన్న చివరి పేద గుడిసె దగ్గరికి వెళ్లి వారితో దైవ సేవ చేస్తూనే పేదరిక నిర్మూలన ప్రణాళికలను రచిస్తూ, పేద రైతులకు సబ్సిడీ పైన విద్యుత్ మోటార్లు డీజిల్ మోటార్లు ఇవ్వడం వారిని సోమరిపోతులు గా కాకుండా వారు తీసుకున్న వస్తువులకు నామమాత్రపు ధర ని వాయిదా పద్ధతులలో వసూలు చేస్తూ అలా బావిలను త్రవ్వించటం, వ్యవసాయ అనుబంధ పరికరాల్ని అందించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు స్టేషన్గన్పూర్ పరిసర గ్రామాల్లో చేయటం జరిగింది. వారికి విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వారి పిల్లల్ని పాఠశాలలకు పంపే విధంగా ప్రోత్సహించేవారు,
పేదలు గృహాలు నిర్మించుకోవడానికి రేకులను సహాయం చేయడం ఇటుకలను కొనివ్వడం పేదల గృహ నిర్మాణానికి తన వంతుగా సహాయ సహకారాలు అందించేవారు ఎంతోమంది పేదలు గుడిసెల్లో కాకుండా పక్కా ఇండ్లలో నివసించడానికి అతని ఆలోచనలు అతను కల్పించిన సదుపాయాలు నేటికీ చెక్కుచెదరకుండా పేదలకు ఉపయోగపడుతున్నాయి. తను నిర్మించిన ఆసుపత్రులు నేటికీ పనిచేస్తున్నాయి.
నిరంతరం మన ప్రాంత ప్రజల కోసమే తన జీవితాన్ని వెచ్చించిన దార్శనికుడు, జనం బాధను తన బాధగా కొట్లాడే మనస్తత్వం. ప్రజలే తన కుటుంబంలా భావించేవారు.నిరుపేదల పక్షాన ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప వ్యక్తి ఫాదర్ కొలంబో.
- నిరుపేదల సంక్షేమానికి విద్యయే మార్గంగా అడుగులు వేసిన – కొలంబో
విదేశీయుడు అయినా నిస్వార్థమైన సేవా దృక్పథాన్ని చూపిస్తు మన ప్రాంత వాసుల భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యడం కోసం కృషి చేశారు, వ్యక్తిని మహోన్నతుడిగా తీర్చి దిద్దేది విద్య ఒక్కటే అనేది ఎంత వాస్తవమో, ఆవిధంగా మన ప్రాంతవాసులను మహోన్నతులుగా తీర్చిదిద్దుటకు కొలంబో గారు సమాజం పట్ల ప్రేమతో అంకితభావంతో సేవ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారు స్థాపించిన కళాశాలలో మరియు పాఠశాలలో ప్రవేశాలకు ఏంతో పోటి పడేవారు. పేదలకు అనుగుణంగా కార్పొరేట్ విద్యని పేదల స్థాయికి తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు ఫాదర్ కొలంబో గారు కరుణాపురం లో జేఎన్జే కళాశాల విద్యానికేతన్ కళాశాల మరియు పాఠశాల వరంగల్ మెడికల్ కళాశాల, స్టేషన్ ఘన్పూర్ లో పాఠశాలలు, కళాశాల, యశ్వాన్తపూర్ లో ఇంజనీరింగ్ కళాశాల లను స్థాపించి పేదలకు బడుగు బలహీన వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం అక్కడ చదివిన ఎంతో మంది పేద విద్యార్థులు నేడు ఎన్నో ఉన్నత స్థాయి శిఖరాలను అధిరోహించడం జరిగింది కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి అతి తక్కువ ఫీజులు మరియు పేదలకు ఫీజుల రాయితీ లు కల్పించేవారుప్రతి సంవత్సరం 1700 మందికి పైగా గ్రామీణ ఇంజనీరింగ్ విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను సంపాదించడానికి సేవలందిస్తోంది. ఫాతిమా చారిట్రబుల్ ట్రస్ట్ ని స్థాపించి దాని ద్వారా శాశ్వతంగా పేద విద్యార్థుల కు నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారు.
ఆయన జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శం. చిన్న తనం నుండే సామాజిక సృహ దైవ భక్తి మెండుగా ఉండేవి.
వారు నిర్మించిన బిల్డింగులు నేడు ప్రభుత్వ గురుకుల పాఠశాలలుగా వేల మంది విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. వారు ఒక ఇంజనీర్ గా ఒక డాక్టర్ గా ఒక శిల్పిగా వారు నిర్మించిన బిల్డింగ్ లు సజీవ సాక్షాలు. 30 సంవత్సరాల క్రితం నిర్మించిన బిల్డింగులు కూడా నేడు పటిష్టమైన స్థితిలో ఉండి వేల మంది విద్యార్థులకు వసతిగృహాలుగా సేవలందిస్తున్నాయి. వారి ఆశయాలు ఇప్పటికి కొనసాగుతున్నాయంటే వారి ఆత్మీయ వారసుడు ఫాదర్ సుధాకర్ రెడ్డి గారి కృషి అభినందనీయం. వారు లేరనే లోటే కానీ, వారి ఆశయాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి జన్మదినం సందర్బంగా ఘనంగా నివాళులు సమర్పిస్తున్నాం….
-
పి. రవికుమార్,
ప్రిన్సిపాల్,
మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాల/ కళాశాల
స్టేషన్ ఘనపూర్.